నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. వైసీపీ హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.డీజీపీ సి హెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పీ హెచ్ డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునః ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది.2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి అప్పటి జగన్ సర్కార్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్‌ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు. ఆ తర్వాత పలు కారణాలతో వాయిదా పడటంతో తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం..ఈ నిర్ణయం తీసుకుంది.అంతకుముందు తెదేపా ప్రభుత్వం హయాంలో ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం2018 నవంబర్ డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన వ్రాత పరీక్ష,దేహాదారుడ్య, శారీరక సామర్ధ్య పరీక్షలు, తుది రాత పరీక్షా అన్నీ కేవలం మూడు నెలల వ్యవధిలో 2019 నాటికే పూర్తిచేశారు.ఇప్పుడు కూడా అదే వేగం తో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: