ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ తుది ఆన్సర్‌ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేయగా.. దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా, శుక్రవారం సాయంత్రం తుది కీ విడుదల చేశారు.పరీక్షకు అర్హులైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జెక్ట్ వైజ్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కూల్‌ అసిస్టెంట్, ల్యాంగ్వేజ్‌ పండిట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌.. పోస్టులకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇందులో సెషన్ల వారీగా, సబ్జెక్టుల వారీగా ఆన్సర్‌ కీలను అందుబాటులో ఉంచారు.కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,45,263 మంది హాజరయ్యారు. ఆగస్టు 13వ తేదీన విడుదలైన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు స్వీకరించగా.. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష రాసిన అభ్యర్ధుల్లో గందర గోళం నెలకొంది. ఏయే ప్రశ్నలకు ఏయే సమాధానాలు సరైనవో తెలియక తికమకపడిపోయారు. దీంతో తుది ఆన్సర్‌ కీ వచ్చేంత వరకూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ రోజు ఫైనల్ ఆన్సర్‌ కీ విడుదలవడంతో ఉత్కంఠకు తెరపడింది.అభ్యర్థులు ఎవరికి వారు ఆన్సర్‌ కీలను చెక్‌ చేసుకుని, తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. వాటికి టెట్‌ వెయిటేజీ మార్కులను కలుపుకుంటే మొత్తం 100 మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో లెక్కించవచ్చు. ఇక రెండు, మూడు రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. అభ్యర్ధుల డీఎస్సీ మార్కులకు, టెట్‌ మార్కులను కలిపి.. ఫైనల్ ర్యాంకును ప్రభుత్వం ప్రకటిస్తుంది.తుది కీని పాఠశాల విద్యాశాఖ వారి అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ నందు అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: