టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ లో వచ్చిన మార్కుల వివరాలు నమోదు చేయడంలో తప్పులు దొర్లిన వారికి తెలంగాణ విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది. మార్కులు, హాల్‌టికెట్, సబ్జెక్ట్‌ ఎంట్రీ వంటి పలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో దొర్లిన తప్పుల సవరణకు పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇవ్వనుంది. డీఎస్సీ తుది కీ విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు టెట్‌ వివరాల నమోదులో తప్పులు దొర్లాలయని, వాటిని సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అవి సవరించకుండా డీఎస్సీ జనరల్‌ ర్యాంకు లిస్ట్‌  ఇస్తే సమస్యలు ఎదురవుతాయని అధికారులు భావించారు. దీంతో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రెండు రోజులపాటు సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు టెట్‌అభ్యర్థుల ఫోన్లకు వ్యక్తిగతంగా కూడా మెసేజ్‌లను పంపనున్నారు. ఇందుకు సంబంధించి నేడో రేపో సవరణలకు అవకాశం ఇస్తూ అధికారిక ప్రకటన వెలువడనుంది.కాగా తెలంగాణ టెట్‌ 2024 ఫలితాలు జూన్‌ 12 విడుదలైన సంగతి తెలిసిందే. మే 20 నుంచి జూన్‌ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు పేపర్‌-1కు 85,996 మంది, పేపర్‌-2కు 1,50,491మంది హాజరయ్యారు. పలితాల్లో పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కులను కలిపి తుది ఫలితాలను ప్రకటిస్తారు. అయితే తాజాగా డీఎస్సీ తుది వెలువడిన సంగతి తెలిసిందే.మరో వారంలో డీఎస్సీ ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీ మార్కులకు టెట్‌ మార్కులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేస్తే.. ఆ తర్వాత టెట్‌ వివరాల ఎంట్రీలో దొర్లిన తప్పులను సవరించే అవకాశం ఉండదు. దీంతో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తం అవుతుంది. ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో మెరిట్‌ లిస్టు ప్రకటించి, వారందరికీ ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: