మరోసారి కులగణన సర్వేలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అవకాశం ఇచ్చింది. గతంలో పాల్గొనని వాళ్లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. అయితే దీన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్న కేటీఆర్.. అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.



అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం  అసంపూర్తి  లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 
రెండోసారి సర్వేనైనా సమగ్రంగా చేయడంతోపాటు.. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. కేవలం తూతూమంత్రంగా తీర్మానం చేసి.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పందించారు.


కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిదని కేటీఆర్ కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: