
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, "క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండాక్ట్ ఉన్న వారిని ప్రజలు ఎన్నుకోవాలి. కానీ ప్రజలు కూడా క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ చూస్తున్నారు. ఆ నాలుగు సీలు పోయి, ఈ సీలను చూడటం విచారకరం," అని వ్యాఖ్యానించారు. కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందిన వారు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.
"రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి, తాత్కాలికంగా ఇచ్చే ఉచిత హామీలను నిలిపివేయాలి. ప్రజలు కూడా ఉచితాలకు ఆశపడి, మీ పిల్లల భవిష్యత్ను నాశనం చేయొద్దని కోరుతున్నా," అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో వస్తున్న మార్పును గమనించి, రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంత డబ్బు పెట్టుబడి పెడితే వాటిని రాబట్టుకునేందుకే చూస్తారని ఆయన విమర్శించారు. "మన భవిష్యత్కు మనం ఓటు వేస్తున్నామని ప్రజలు ఆలోచించాలి," అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.