బీజేపీ ఏపీ  రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నూతన అధ్యక్షులు, ఆహ్వానితులు పాల్గొన్నారు. సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 14న అంబేడ్కర్ జయంతి నిర్వహణపై నిర్ణయాలు తీసుకున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఆరు కార్యక్రమాలను చేపట్టాలని నేతలకు సూచించారు.


పురందేశ్వరి మాట్లాడుతూ, అందరి సహకారంతో 25 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరిగిందని, 21 వేల మందికి క్రియాశీలక సభ్యత్వం ఇచ్చామని తెలిపారు. పార్టీకి బూత్ స్థాయిలో 2.18 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని వెల్లడించారు. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఒక్క పెట్టుబడి కూడా రాకుండా ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. మద్యం మాఫియాతో వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఇసుక, మట్టి విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరించారని విమర్శించారు.


కేంద్రం సహకారంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పురందేశ్వరి అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమన్వయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పీ 4 కార్యక్రమం ప్రారంభించిందని, ధనవంతులు పేదలకు చేయూత ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారని పేర్కొన్నారు. మహాకూటమిలోని మూడు పార్టీల సమన్వయం బాగుందని, క్షేత్రస్థాయిలోనూ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: