టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మాద్యమాలు బాగా పెరిగిపోయాయి. అయితే ఈ మద్య ఆర్థిక లావాదేవీలు కూడా స్మార్ట్ ఫోన్లలోనే జరిగిపోతున్నాయి. బ్యాంక్ లకు సంబంధించిన ఎన్నో యాప్స్ వస్తున్నాయి. స్మార్ట్ఫోన్ యుగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్ మెసెంజర్... తాజాగా మరో కొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఉంటే చాలు ఇకపై చెల్లింపులు చేయవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా వాట్సాప్లో నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఐవోఎస్, ఆండ్రాయిడ్ మొబైల్లో 'వాట్సాప్ బీటా వెర్షన్' వినియోగిస్తున్న వారు ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చు. ఐవోఎస్లో 2.18.21 వాట్సాప్ వెర్షన్, ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు 2.18.41 వెర్షన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల కంపెనీ పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాట్సాప్ పై మండిపడుతున్నారు. వాట్సాప్ ప్రయోగాత్మకంగా పేమెంట్స్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
వాట్సాప్ అన్నది కేవలం ఇన్ స్టాల్ చేసుకుని మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ అయ్యే వేదిక. ఇతరత్రా వివరాలు ఏవీ అవసరం లేదు. దీన్నే శర్మ ప్రశ్నిస్తున్నారు. ఫేస్ బుక్ (వాట్సాప్ యజమాని) బహిరంగంగా మన చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)ను స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని శర్మ ఆరోపిస్తున్నారు. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (యూపీఐను అభివృద్ధి చేసిన సంస్థ)కు ఫిర్యాదు చేస్తానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని శర్మ చెప్పారు.