
అవును మరి.. గౌతమ్ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రూ.3.67 లక్షల కోట్లు పెరిగిందంటే నమ్మగలరా. అంతర్జాతీయ అగ్రగామి కుబేరుల కంటే ఈ పెరుగుదల రేటు చాలా ఎక్కువ. అయితే ఇప్పటి వరకూ ఇండియాలో టాప్ వన్ పొజిషన్ మాత్రం ఇంకా ముకేశ్ అంబానీదే. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తాజాగా విడుదల చేసిన లెక్కలపై ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ జాబితా ప్రకారం ఆసియా కుబేరుల్లో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తన గతేడాది సంపదకు ఏకంగా 49 బిలియన్ డాలర్ల అంటే.. మన రూపాయల్లో 3.67 లక్షల కోట్ల అన్నమాట.. యాడ్ చేశారు.
ఈ లెక్కను బట్టి చూస్తే.. ఏడాదిలో ఆయన సంపాదించిన సగటు లెక్కేస్తే.. రోజుకు గౌతమ్ అదానీ కనీసం రూ.1,000 కోట్లు సంపాదించారని తేలుతోంది. 2022 ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో టాప్ పొజిషన్లో ఉన్న ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంటే అదానీ ఎక్కువ సంపాదించడం విశేషం.
ప్రధానిగా మోడీ వచ్చిన తర్వాతే గౌతమ్ అదానీ ప్రభ వెలగడం ప్రారంభమైందని.. ఆయనకు అనుకూలంగా మోడీ సర్కారు అనేక నిర్ణయాలు తీసుకుందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా.. ఈ స్థాయిలో సంపాదన పెంచుకోవడం మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది. మరి ఈ గౌతమ్ అదానీ ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.