ఓలా స్కూటర్లు కొన్న వారికి అనేక సమస్యలు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కొన్న ఓలా స్కూటర్ కూడా పాడైపోయింది. దాంతో ఆయన కోర్టుకు వెళ్ళారు. అన్ని వివరాలను పరిశీలించిన సంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ.1,92,205 చెల్లించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే జహీరాబాద్‌కు చెందిన మద్ది దావీద్ అనే వ్యక్తి ఓలా స్కూటర్ కొన్నారు. కొన్న రోజులకే స్కూటర్ రోడ్డు మీద ఆగిపోయి ఆయన ఇబ్బంది పడ్డారు. ఈ స్కూటర్ కొనడానికి ఆయన బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు. ఓలా కంపెనీ, పాడైన స్కూటర్‌ను విక్రయించడం ద్వారా వినియోగదారులను మోసం చేసిందని కోర్టు నిర్ధారించింది. అందుకే కంపెనీకి జరిమానా విధించింది.

ఆ తీర్పు ప్రకారం వినియోగదారు చెల్లించిన రూ.1,67,205లను తిరిగి ఇవ్వాలి. ఆ మొత్తంపై కొనుగోలు చేసిన రోజు నుంచి (2023, జులై 3) డబ్బు తిరిగి వచ్చే వరకు 9% వడ్డీని కూడా చెల్లించాలి. వినియోగదారుకు జరిగిన నష్టానికి రూ.30,000లు నష్టపరిహారం ఇవ్వాలి. ఓలా కంపెనీ తన బ్యాంకు ఖాతాలో "వినియోగదారుల చట్ట సహాయం" అనే నిధిలో రూ. 5,000లు జమ చేయాలి.

మద్ది దావీద్ తన ఓలా స్కూటర్ సరిగా పనిచేయడం లేదని కంపెనీ వారికి చెప్పారు. కంపెనీ సర్వీస్ పర్సన్లు కొన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఏమీ చేయలేదు. కోర్టు ఓలా కంపెనీకి అనేకసార్లు నోటీసులు పంపింది. కానీ కంపెనీ కోర్టు ముందు హాజరు కాలేదు లేదా వివరణ ఇవ్వలేదు. కోర్టు, ఓలా కంపెనీ పాడైన వాహనాన్ని విక్రయించిందని నిర్ధారించి ఆదేశాలను 30 రోజులలో పాటించాలని ఆదేశించింది.

అలా వినియోగదారునికి న్యాయం చేసింది. ఈ సంఘటనలో బాధితుడు పోరాటం చేసినట్లే వినియోగదారులు తమ హక్కుల కోసం పోరాడాలి, కంపెనీలు వినియోగదారులను నిర్లక్ష్యం చేయకూడదు. లేకపోతే భారీ జరిమాణాలు చెల్లించుకోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: