
మాంసాహారులకు ఎంతోమందికి ఇష్టమైనది చేప కూర.. అలాంటి చేప కూరను వివిధ రకాల్లో చేసుకొని తినచ్చు. అలాంటి ఈ చేప కూర మసాలా పెట్టి చేస్తే ఆహా అనకుండా ఉండలేరు.. అంత అద్భుతంగా ఉంటుంది ఈ మసాలా చేప కూర. ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావాల్సిన పదార్ధాలు..
చేప - ఒకటి,
నిమ్మకాయ - ఒకటి,
ఉప్పు - రుచికి తగినంత,
ఎండుమిర్చి - పది,
లవంగాలు - ఆరేడు,
దాల్చినచెక్క - చిన్నవి రెండు,
ఆకుపచ్చ యాలకులు - ఐదు,
జీలకర్ర, నల్ల మిరియాలు - పావు చెంచా,
అల్లం ముక్కలు - రెండు,
వెల్లుల్లి, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున,
నూనె - టేబుల్ స్పూను,
పంచదార - చెంచా,
వెనిగర్ - కొద్దిగా.
తయారీ విధానం...
ఎండుమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర, మిరియాలను కాసిని నీటిలో నానబెట్టాలి. అల్లం, వెల్లుల్లిని వెనిగర్లో నానబెట్టాలి. ఆ తరవాత వీటన్నింటినీ మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించి పంచదార చల్లాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమానికి కలపాలి. చేపను శుభ్రం చేసి విడిపోకుండా ముక్కల్లా తరగాలి. ఇందులో తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూరి సరిపడా ఉప్పు, నిమ్మరసం చేపకు పట్టించి ఫ్రిజ్లో ఉంచాలి. గంటయ్యాక తీసి పెనంపై మిగిలిన నూనె వేడి చేసి వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా కాల్చితే సరిపోతుంది.