పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో కన్నతల్లే అతడిని కడతేర్చింది. చనిపోయిన విషయం కూడ బయటకు తెలియకుండా చేసింది. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన హరిజన్ నాగమ్మ అనే మహిళకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు శివ (26) మద్యానికి బానిసై తరచూ నాగమ్మను వేదించేవాడు.
అయితే వారంక్రితం తాగి వచ్చి మద్యం మత్తులో తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడి ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి, వాడిని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించింది. మరోసారి మద్యం మత్తులో ఉన్నప్పుడు అవకాశం చూసి వేసేయాలని నిర్ణయించింది. దీంతో పదిహేను రోజుల క్రితం శివ మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో తన తల్లి బుచ్చమ్మ సాయంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడి గొంతు కోసి హతమార్చింది. ఇక ఆ విషయం కూడ బయటకు చెప్పకుండా ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
ఇక కొద్ది రోజుల తర్వాత శివ కనిపించకపోవడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఆనోటా ఈనోటా బయటకు రావడంతో స్థానిక సర్పంచ్ ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు..ఇంట్లో ఉన్న శవాన్ని బయటికి తీసిన తర్వాత పోస్టుమార్టమ్ నిర్వహించనున్నట్టు తెలిపారు.