ఇటీవలే హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో మద్యం మత్తులో ఏకంగా కత్తితో గుండెల్లో తానే పొడుచుకొని మరణించిన యువకుడి స్టోరీ వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ ఆడుకుందాం అంటూ ఒక స్నేహితుడినీ బయటకు పిలిచినా ముగ్గురు బాలురు తమతో పాటు తెచ్చుకున్న బ్లేడ్ తో వీపు పైన తొడల పైన గాయపరిచారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్నెంబర్ 2లో ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి వెనక ఇందిరా నగర్ లో నివసిస్తూ ఉంటాడు తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీహరి.
ఇక ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీహరి తన ఇంటి ముందు హోలీ ఆడుకుంటున్న సమయంలో ఇక పక్క పక్కనే నివసించే మరో ముగ్గురు స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. ఇక ముందుగా శ్రీహరికి రంగులు పుశారు. ఆ తర్వాత తమతో పాటు తెచ్చుకున్న బ్లేడుతో వీపు మీద తొడల మీద గాట్లు పెట్టారు. అయితే తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్న సమయంలో శ్రీహరి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బాధితుడి తల్లి లక్ష్మి అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్ళింది. దాడికిపాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..