
కొన్ని కొన్ని సార్లు రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏకంగా ప్రాణాల మీదికి తేవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఎలాంటి పంటలోనైనా సరే కలుపు నివారణల కోసం రసాయన మందులు వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే. పంట పొలంలో ఇలా రసాయన మందులు పిచికారి చేసిన సమయంలో రైతులు ఎన్నో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది రైతులు మాత్రం జాగ్రత్తలు పాటించకుండా పురుగుల మందులు పిచికారీ చేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు.
పత్తిలో దోమ మందు పిచికారి చేసిన ఓ యువ రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రిలో మూడు రోజులపాటు చికిత్స పొందిన రైతు చివరికి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం మానవత్ తండాలో వెలుగులోకి వచ్చింది. రామవత్ శ్రీను నాయక్ అనే 27 ఏళ్ల యువరైతు రెండున్నర ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటను దోమ ఆశించింది. దీంతో తెగులు నివారణకు ఇటీవల పురుగుల మందు పిచికారి చేశాడు. ముఖానికి ఎలాంటి రక్షణ ఏర్పాటు చేసుకోకపోవడంతో పురుగుమందు పీల్చి అస్వస్థకు గురై కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చివరికి సదరు యువరైతు మృతి చెందాడు.