ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఒక ఆశా వర్కర్ దారుణమైన నిర్వాకం బయటపడింది. ఈ ఆశా వర్కర్ ఓ గిరిజన యువకుడికి తెలియకుండానే, అతని అనుమతి లేకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. ఈ ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు గంగ దురువా అంబగూడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు. అతను పుట్టుకతోనే మూగవాడు.

నివేదికల ప్రకారం, పొరుగు గ్రామమైన కొసర్బాటాకు చెందిన గంగారాం దురువా అనే మరో గిరిజనుడికి కుటుంబ నియంత్రణ చేయాల్సి ఉంది. కానీ గంగారామ్ ఆపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించాడు. దాంతో ఆశా వర్కర్ జింకీ మాఝీ అతనికి బదులుగా గంగపై ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన మత్తిలి సబ్ డివిజనల్ ఆసుపత్రిలో ఆగస్టు 3న చోటుచేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని చెప్పకుండా పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ మహిళ ఈ మూగవాడిని పిలిచింది. అది తెలియక గంగను అన్నయ్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తర్వాత అతనికి అనస్థీషియా ఇచ్చి అతని అనుమతి లేకుండా ఆపరేషన్ చేశారు.

గంగకి మెలకువ వచ్చేసరికి చాలా నొప్పిగా అనిపించింది. అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. చివరికి జరిగిన వ్యవహారమంతా తెలిసింది. దాంతో తనకి ఇంకా పెళ్లి కాలేదని, పిల్లలు ఇకపై తనకు పుట్టరని సదరు బాధితుడు తల బాధకుంటూ ఏడ్చేశాడు. తన తమ్ముడు గంగకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశారని తెలిసి అతని సోదరుడు కూడా షాక్ అయ్యాడు. గంగ కుటుంబ సభ్యులు జింకీ మాఝీపై మథిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆశా వర్కర్‌ను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఈ సంఘటన భారతదేశంలోని గిరిజన ప్రజల దుర్బలత్వాన్ని ఎత్తి చూపుతోంది. వారి విద్య, అవగాహన లేమిని ఉపయోగించుకుని చాలామంది దారుణాలకు ఒడిగడుతున్నారు. జింకీ మాఝీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆశా వర్కర్లకు మెరుగైన శిక్షణ అందించాలి. గిరిజనులకు కుటుంబ నియంత్రణ గురించి నాణ్యమైన సమాచారం అందుబాటులో ఉండేలా ఉంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: