కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపురం జిల్లాలో ప్రేమ పెళ్లి విషాదాంతంగా మారింది. మైలపనహళ్లి గ్రామంలో ఫసిహా, నాగార్జున అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ఫసిహా వయసు 23 ఏళ్లు. అది చట్టబద్ధమైన వివాహ వయసే. ఇక నాగార్జున వయసు 25 ఏళ్లు. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో మార్చి 23న పోలీసుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అప్పటివరకు బాగానే ఉన్నా.. పెళ్లయిన రెండు వారాలకే కథ అడ్డం తిరిగింది.

పెళ్లి చేసుకున్న కొత్తలో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఒక్కసారిగా వధువు మనసు మార్చుకుంది. మతాంతర వివాహం చేసుకోవడం వల్ల తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, ఇక తాను పుట్టింటికి వెళ్లిపోతానని తెగేసి చెప్పింది. పోలీసులకు రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో ప్రేమించిన వాడిని నమ్మి పెళ్లి చేసుకున్న నాగార్జున ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న ఫసిహా ఇంత త్వరగా ఇలా మాట మార్చడానికి కారణం ఏంటనేది అంతుచిక్కడం లేదు. అసలు తల్లి ఆరోగ్యం నిజంగానే బాగోలేదా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనతో ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే జంటలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు.

ప్రేమ ముసుగులో మోసం చేసేవాళ్లు ఉంటారని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రేమ జంట కథ మాత్రం అర్ధంతరంగా ముగిసింది. ప్రేమించిన వాడిని వదిలి వెళ్ళిపోయిన ఫసిహా నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత మాత్రం దానికే పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నాలుగు రోజుల పెళ్లిళ్లకు అందర్నీ బాధ పెట్టడం ఎందుకు అని నిలదీస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పెళ్లిళ్లు విడాకులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: