జనసేనను స్థాపించి పది ఏళ్లు కావొస్తోంది. కానీ ఇంత వరకు పార్టీని పటిష్ఠపరిచేందుకు బూత్ కమిటీలను వేయలేదు. సంస్థాగతంగా కమిటీలు లేవు. వారాహి యాత్ర సందర్భంగా స్థానిక నేతలను పరిచయం చేస్తూ ఈయనే మీ అభ్యర్థి అంటూ ప్రకటించలేదు. ఇవన్నీ పవన్ చేసిన లోపాలుగా రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ అవన్నీ తప్పు అని ఇప్పుడు వారికి అర్థం అవుతుంది.
ఎందుకంటే కమిటీలను నియమించి.. మండల, జిల్లా అధ్యక్షులను నియమిస్తే వారు రాజకీయ భవిష్యత్తును కోరుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసేలా ఒత్తిడి తెస్తారు. అప్పుడు వారికి సీట్లు ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తారు. పార్టీలు మారతారు. ఇది పార్టీపై ప్రభావం చూపుతుంది. ఎలాగూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం అని ఆదిలోనే బలంగా ఫిక్సయినట్లు ఉన్నారు. అందుకే కమిటీలను ఏర్పాటు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
నియోజకవర్గ ఇన్ ఛార్జిలను మాత్రం నియమించారు. ఇప్పుడు వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి సీట్లు ఇస్తుండటంతో జనసేన ఇన్ ఛార్జిలు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా అమలాపురం లోక్ సభ ఇన్ ఛార్జి డీఎంఆర్ శేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. ఓఎన్జీసీ అధికారి అయిన శేఖర్ సర్వీస్ వదులుకొని మరీ జనసేనలో చేరారు. ఈ సారి అమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో వైసీపీలోచేరేందుకు సిద్ధం అయ్యారు. దీంతో పాటు జనసేన నేత మనుక్రాంతి రెడ్డి, మాజీ మేయర్ సరోజ వైసీపీలో చేరారు.