తాజాగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బడ్జెట్ లో 15 శాతాన్ని మైనార్టీలకు కేటాయించాలని ఆ పార్టీ యోచిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ ప్రపోజల్ ను తెచ్చిందని.. కానీ బీజేపీ వ్యతిరేకించడంతో అది అమలు కాలేదన్నారు. ఇప్పుడు మరోసారి ఈ ప్రపోజల్ ను ముందుకు తేవాలని ఆ పార్టీ చూస్తోందని విమర్శించారు. మత ప్రాదిపాదికన బడ్జెట్ ను కేటాయించడం అనేది ప్రమాదకరమని పేర్కొన్నారు.
తాజాగా మోదీ చేసిన విమర్శలను గమనిస్తే.. ముస్లింల కోసం ప్రత్యేక బడ్జెట్ తెస్తానని కాంగ్రెస్ ఎప్పుడూ ప్రకటన కానీ.. ఆలోచన కానీ చేయలేదు. ఒకవేళ చేసినా ఇంత పెద్ద అంశం బయటకు రాకుండా ఉండదు. నిజంగా యూపీఏ హయాంలో దీనిని అమలు చేయాలని కాంగ్ఎస్ భావిస్తే నరేంద్ర మోదీ ఓ రాష్ట్రానికి ముఖ్య మంత్రి. ఓ సీఎం చెప్పారని.. ఆ ప్రపోజల్ ను వెనక్కి తీసుకోదు.
ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేదు. ఇప్పుడు మోదీ తెచ్చిన అనేక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా.. తాను అనుకున్నదే తడవుగా వాటిని అమలు చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే 2014, 19 ఎన్నికల్లో దీని గురించి ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడే ఎందుకు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి మరోసారి హిందూ, ముస్లిం అంశాలు తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.