గత ఫిబ్రవరిలో పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే దక్షిణాది రాష్ట్రాలు రచ్చ చేశాయి. కర్ణాటకకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీలు చేసిన గొడవ అందరి దృష్టిని ఆకర్షించింది.  ఇప్పుడు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోను బిహార్, ఏపీలకు తప్ప మరే రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు.


కేంద్రం కావాలనే దక్షిణాదిపై చిన్నచూపు చూస్తోందని.. పైగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సరిగా నిధులు కేటాయించకుండా వివక్ష చూపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. తమకు కేంద్ర బడ్జెట్ లో పదే పదే అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరన్ విజయ్ లు ముప్పేట దాడి చేస్తున్నారు. ఇప్పుడు వీరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తోడు అయ్యారు. వీరంతా కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని.. మోదీ వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్పూర్తిగి విరుద్ధం అని విమర్శిస్తున్నారు.


అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోను బీజేపీకి దక్షిణాదిలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన పార్టీ బలపడాలన్నా… మరోవైపు ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా ఒక్కటే మార్గం అని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. అదే దేశానికి రెండో రాజధాని.


ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను అన్నింటిని కలిపి ప్రత్యేక దేశం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం రాసినప్పుడే రక్షణ పరంగా, భౌగౌళిక పరంగా కానీ దక్షిణాదికి రాజధాని అవసరం అని పేర్కొన్నారు. బీజేపీ రెండో రాజధానిని ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి  సుప్రీం కోర్టు బెంచ్ ను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కేరళ, అమరావతి ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతుంది అనేది కొంత వరకు అయినా తగ్గుతుంది. దీంతో పాటు పార్టీ బలోపేతం కూడా అవుతుంది. ఈ విషయంలో బీజేపీ నేతలు సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: