పాలస్తీనాలోని  గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రపంచంలోని పలు దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బంధీల విడుదలకు సంధి ఒప్పందాలకు ప్రయత్నిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.


హమాస్ ఓ మిలటరీ వ్యవస్థలా ఎక్కువ కాలం కొనసాగేలేదని పేర్కొన్నారు. తొలి దశలో ఇజ్రాయెల్ బంధీల విడుదలకు హమాస్ తో ఒప్పందానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భద్రతా పరమైన సవాళ్ళ నేపథ్యంలో హమాస్ తో ఒప్పందం వ్యూహాత్మక అవకాశంగా నిలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ బంధీలను స్వదేశానికి తీసుకురావడమే సరైన నిర్ణయం. ఇజ్రాయెల్ ఆరు వారాల పాటు కాల్పుల విరామం తీసుకొని.. బంధీలను తిరిగి తీసుకురావడానికి ఒప్పందాన్ని ఆమోదించాలి.


11 నెలలకు పైగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్లు భావిస్తున్నా.. హమాస్ గెరిల్లా యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్ కూడా హమాస్ మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ పటిష్ఠమైన మిలటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగుతుందనే నమ్మకం లేదు అని అన్నారు.


ఇక గాజాలో ఇజ్రాయెల్ హమాస్ కు జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు మధ్య వర్తుల ప్రయత్నాలు సాగిస్తున్న వేళ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక గతేడాది అక్టోబరు 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 41 వేల మంది పాలస్తీనీయులు మృతి చెందారు. కొన్ని వేల మంది గాయపడ్డారు. ఇక తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలు అనే తేడా లేకుండా అన్నింటిపై విచక్షణా రహితంగా రాకెట్లతో దాడి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: