ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం హాయిగానే ఉంది కదా. అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు ప్రశాంతంగా తమ పని తాము  చేసుకుంటూ పోతున్నారు కదా అని అంతా అనుకోవచ్చు. కానీ ఇదే కూటమిలో బీజేపీ ఉంది. అందుకే బీజేపీ ఏపీలో తన అధికారాన్ని విస్తరించేందుకు పవన్ కల్యాణ్ ద్వారా చురుకుగా పావులు కదుపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.


ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు అని ఆయన అన్నారు. నెల్లూరులో జరిగిన సీపీఎం మహాసభలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర స్థాయిలోనే కుట్ర జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో బీజేపీ పవన్ ను పావుగా వాడుకుంటుంది అని అన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ట్రాక్ లో పడ్డారని విమర్శించారు. ఆయన వైఖరి ఏపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా తెర వెనుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని మండిపడ్డారు.


రెండేళ్ల వ్యవధి లో చంద్రబాబుని గద్దె నుంచి దించేసి పవన్ కల్యాణ్ ని సీఎం గా చేయడానికి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసమే ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.  లడ్డూ ప్రసాదాల విషయంలో విద్వేషాలను చొప్పించడం వెనుక ఉంది ఇదేనని ఆయన అన్నారు. మత విద్వేషాలు జరిగితే ఏపీలో కూడా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర మాదిగా అశాంతితో రగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


మరోవైపు ఏపీలో కూటమి వంద రోజుల పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. ధరలు మండిపోతున్నాయని.. నిరుద్యోగులకు అవకాశాలు రావడం లేదని.. ఏ రకమైన అభివృద్ధి పనులు ప్రారంభం కావడం లేదని వారు పేర్కొన్నారు. ఈ సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే తాజాగా కామ్రెడ్లు చేసిన ఆరోపణలు మాత్రం రాజకీయంగా సంచలనంగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: