ఇప్పుడు నేషనల్ మీడియాలో ఓ అంశంపై పెద్ద రచ్చ నడుస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిరిండియా సంస్థ పేలవమైన విమాన సర్వీస్ తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియాలో ప్రయాణించిన కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కు విరిగిపోయిన సీటును కేటాయించారు.
ఆ సీటులో ఆయన కూర్చోవడానికి అసౌకర్యానికి గురయ్యారు. తనకు ఎదురైన అనుభవంపై ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన దారుణమైన పరిస్థితిని వివరించారు. టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న తర్వాత సేవలు మెరుగుపడతాయని ఆశించాను కానీ.. ఏ మాత్రం బాగుపడలేదని ఇప్పుడు అర్థమైందంటూ తన అసహనం వెళ్లగక్కారు.
"నేను భోపాల్ నుంచి ఢిల్లీకి వచ్చి.. పూసాలో కిసాన్ మేళాను ప్రారంభించాల్సి వచ్చిందని.. కురుక్షేత్రలో సహజ వ్యవసాయ మిషన్ సమావేశం నిర్వహించి, చంఢీగర్ లోని కిసాన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సమావేశం కావాల్సిఉందని..ఈ ప్రయాణం కోసం నేను ఎయిర్ ఇండియా విమానం నంబర్ A1436లో టికెట్ బుక్ చేసుకున్నానని చౌహాన్ తెలిపారు. నాకు సీటు నంబర్ 8C కేటాయించారని.. నేను వెళ్లి సీటుపై కూర్చునే ప్రయత్నం చేయగా అది విరిగిపోయి ఉండటంతో కూర్చోవడం అసౌకర్యంగా మారిందని చౌహాన్ తన పోస్టులో వివరించారు.
తనకు కేటాయించిన విరిగిన సీటు విషయాన్ని ఎయిర్ లైన సిబ్బందిని అడిగినప్పుడు.. సీటు పరిస్థితి గురించి యాజమాన్యానికి తెలుసని, ఆ సీటు టికెట్ అమ్మకూడదు అని వారు చెప్పారని చౌహాన్ వెల్లడించారు. అయితే విమానంలో ఇతర ప్రయాణికుల సీట్లు కూడా అలానే ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత మంచి సీట్లు కేటాయించాలని తెలియదా? అని చౌహాన్ ప్రశ్నించారు. భవిష్యత్ లో ఏ ప్రయాణికుడికి ఇలాంటి ఇబ్బందకర పరిస్థితి ఎదురవ్వకూడదని సంస్థను కోరడం జరిగిందన్నారు.
కాగా ఈ సంఘటనపై ఎయిరిండియా స్పందించింది. కేంద్రమంత్రికి కలిగిన అసౌకర్యానికి ఎయిరిండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. దీనికి హామీ ఇస్తున్నట్లు సంస్థ తన ప్రకటనలో హామీ ఇచ్చింది.