ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇలాంటి కేబినెట్ మీటింగ్ జరిగి ఉండదు. ఎందుకంటే.. ఇవాళ్టి కేబినెట్ మీటింగ్ తర్వాత.. ఆ కేబినెట్లో ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేయాల్స ఉంటుంది. ఇలా మంత్రులంతా మూకుమ్ముడిగా రాజీనామాలు చేసిన ఉదంతాలు.. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. గతంలో ఎన్టీఆర్ కూడా ఒకసారి అందరు మంత్రులతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ఫ్రెష్గా మంత్రులను నియమించుకున్నారు.
అయితే.. ఇప్పటి జగన్ కేబినెట్ మీటింగ్కూ ఎన్టీఆర్ మీటింగ్కూ తేడా ఉంది. ఎన్టీఆర్ అప్పట్లో అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. చకచకా రాజీనామాలు తీసుకున్నారు. కానీ. జగన్ అలా కాదు.. అధికారంలోకి వస్తూనే మంత్రులను నియమించుకుంటున్న సమయంలోనే వారు రెండున్నరేళ్లకు దిగిపోతారని ముందే చెప్పేశారు. ఇప్పుడు జగన్ చేస్తున్నది జస్ట్.. తాను చెప్పింది అమలు చేయడమే. సాధారణంగా కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనేక కీలక అంశాలపై చర్చ జరుగుతుంది.
కానీ ఇవాళ్టి జగన్ కేబినెట్ మీటింగ్ మాత్రం మంత్రుల్లో ఏమాత్రం హుషారు, ఆనందం లేకుండానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులుగా ఇది చాలా మందికి చివరి రోజు అయి ఉంటుంది. సాధారణంగా ఒకసారి మంత్రి అయితే.. దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉండే వారే ఎక్కువ. కానీ ఇలా మూడేళ్లకే మొత్తం మంత్రి వర్గ సభ్యులు పదవులు పోగొట్టుకోవడం మాత్రం ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే.