కానీ ఒక్క మేడిగడ్డ కుంగుబాటుతో ఆ ప్రాజెక్టు గొప్పతనం ఏంటో.. అన్నారం బ్యారేజీలో ఏర్పడిన ఇసుక మేటలతో అందులో ఉన్న నాణ్యత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పటి అధికార బీఆర్ఎస్ కు ఒక విధంగా కంటగింపుగా మారింది. చివరకి ఈ ప్రాజెక్టు ప్రస్తావన లేకుండా ప్రచారం ముగించారు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. అయితే మేడిగడ్డ కుంగుబాటు తర్వాత కాంగ్రెస్ మంత్రులు శుక్రవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ విషయమై రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… నేనొక సాధారణ వ్యక్తిగా అడుగుతున్నా అంటూ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూ.38వేల కోట్లతో 16.40లక్షల ఎకరాల ఆయకట్టు అందించేందుకు ప్రాణ హిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించామన్నారు. రూ. 11వేల కోట్లు సైతం ఖర్చు చేశామని..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు ప్రణాళికను మేడిగడ్డ వద్దకు మార్చింది.
తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతో మేడిగడ్డ బ్యారేజ్ ను నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్ రేటు కంటే 12శాతం వడ్డీ కడుతున్నామన్నారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజెన్సీతో కట్టిస్తారా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. మరోవైపు కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లలో చూపిన ఆసక్తి పనుల నాణ్యతలో చూపించలేదని విమర్శించారు.