అయితే బీజేపీతో పొత్తు టీడీపీకి 2014 మాదిరి వర్కౌవుట్ కావడం లేదని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో భాగస్వామి పక్షాలకు బీజేపీ అందిస్తున్న సహకారం ఏపీలో అందడం లేదని అర్థం అవుతుంది. నెల రోజుల క్రితం ప్రధాని మోదీ ఏపీ లో ప్రచారానికి వచ్చారు. తర్వాత బీజేపీ అగ్ర నేతల జాడ లేదు. ఎట్టకేలకు ఒకరిద్దరు నేతలు వచ్చారంటే విరుద్ధ ప్రకటన చేసి టీడీపీని కొలుకోలేని దెబ్బ కొట్టారు.
టీడీపీ ఆవిర్భావంతో మైనార్టీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కానీ టీడీపీ ఎన్డీయేలో చేరడంతో మైనార్టీలు దూరం అవుతూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడవడం ప్రారంభించారు. అయితే సీఎం జగన్ బీజేపీతో సన్నిహితంగా మెలగడాన్ని మైనార్టీలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ వర్గాల్లో చీలిక వచ్చింది. చాలామంది తిరిగి టీడీపీ వైపు చూడటం ప్రారంభించారు.
దీంతో వైసీపీ నయా గేమ్ ప్రారంభించింది. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి అని.. అందుకే బీజేపీతో చేతులు కలిపారని ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉండగా.. బీజేపీ అగ్రనేత పిడుగులాంటి వార్తను ప్రకటించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా తాము మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బాంబ్ పేల్చారు. దీంతో పాటు పియూష్ గోయల్ చంద్రబాబుతో సమావేశం అయిన అనంతరం మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అని ప్రకటించారు. దీంతో చంద్రబాబుకి కొత్త టెన్షన్ మొదలైంది. దీంతో మైనార్టీలు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనలు కూటమిపై స్పష్టమైన ప్రభావం చూపుతాయని విశ్షేషకులు అభిప్రాయపడుతున్నారు.