జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడకన సాగుతున్నందున ఈ కేసును దిల్లీకిగానీ, ఇతర రాష్ట్రాలకు గానీ బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడితోపాటు ఇతర నిందితులు ఏదో ఒక కారణం చూపుతూ కోర్టుల్లో విచారణలు సాగకుండా పిటిషన్లు దాఖలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని 2018 సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 నుంచి ఇప్పటి వరకు సీబీఐ కోర్టుకు ఆరుగురు ముఖ్య న్యాయమూర్తులు వచ్చారు. వారంతా డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు విన్నప్పటికీ తుది ఉత్తర్వులు జారీ చేయక ముందే బదిలీ అయిపోయారు.
ప్రస్తుత సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి 2022 మే 4న బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని డిశ్చార్జి పిటిషన్లపై విచారణ జరిపారు. సుమోటో రిట్ పిటిషన్లో తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ డిశ్చార్జి పిటిషన్లపై ట్రయల్కోర్టు న్యాయమూర్తి ఏప్రిల్ 30న తీర్పు వెలువరించాలి. కానీ ఆయన బాధ్యతలు చేపట్టి కనీసం రెండేళ్లు పూర్తికాక ముందే బదిలీ అయ్యారు.
ప్రస్తుతం హైదరాబాద్ సీఐబీ కోర్టుకు ఒక ముఖ్య ప్రత్యేక న్యాయమూర్తి, ముగ్గురు అదనపు ప్రత్యేక న్యాయమూర్తులను కేటాయించారు. అక్కడున్న మూడు ప్రత్యేక కోర్టుల బాధ్యతలనూ ఒక అదనపు న్యాయమూర్తి మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ప్రిన్సిపల్ జడ్జి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాల కేసుపై రోజువారీ విచారణ చేపట్టారు. ఆయన ఎమ్మార్, వివేకానందరెడ్డి హత్యలాంటి కీలక కేసులతోపాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని సీబీఐ విభాగాలు దర్యాప్తు చేస్తున్న కేసులనూ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉన్న రెండు అదనపు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.