ఈ తరుణంలో ఆయా పార్టీల నాయకులు తామంటే.. తామే విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి ప్రమాణ స్వీకారం తేదీలు కూడా ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నేతలు 130కి పైగా స్థానాల్లో గెలుస్తామని ప్రకటనలు చేస్తుండగా.. ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.
వార్ వన్ సైడ్ అయిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. ఇక మరో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచిందని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి కి కట్టుబడ్డామన్న సీఎం హామీలను ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఇది నూతన ఒరవడి అంటూ అభిప్రాయపడ్డారు.
టీడీపీ మోసాలు, కుయక్తులు చేసిందని ఆయన విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టీడీపీ చేసిన ప్రచారాలను రైతులు నమ్మలేదన్నారు. రాజకీయాల్లో చిత్త శుద్ధి ముఖ్యమని..దానిని చూసే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారన్నారు. విశాఖలో రెండో సారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. జూన్ 9 న అని తారీఖు ఫిక్స్ చేశారు. ఇక టీడీపీ ఓడిపోతుందనే తెలిసి దాడులకు తెగబడుతోందని విమర్శించారు. తాము మంచి చేశాం. అధికారంలోకి వస్తామని నమ్ముతున్నాం కాబట్టే గవర్నర్ కు ఫిర్యాదు చేశామని వివరించారు. మేం సహనంతో ఉన్నాం కాబట్టే టీడీపీ ఎక్కువ దాడులు చేస్తోందని.. మా నాయకుడు పిలుపు ఇస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు.