అయితే ఇక్కడే కొత్త సమస్య వచ్చి పడింది. పోలీసులకు ఈ సిట్ దర్యాప్తు పెద్ద పరీక్షగా నిలవనుంది. ఎందుకంటే ఘర్షణలు జరుగుతాయి అని స్థానిక పోలీసులకు తెలియదా. వారికి స్పెషల్ బ్రాంచి ఉంటుంది. ఒకవేళ నిఘా వర్గాల సమాచారం అంది.. వీళ్లు ఉన్నతాధికారులకు విన్నవించినా వారు పట్టించుకోలేదా. లాంటి ప్రశ్నలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. రాయలసీమలో పోలింగ్ ముందు నుంచే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అడ్డుకోవడంలో పోలీసులు విపలం అయ్యారు. ఈ ఘటనలకు బాధ్యులను చేస్తూ చాలా మంది ఉన్నతాధికారులపై వేటు పడింది. శాఖా పరమైన విచారణ కూడా కొనసాగుతుంది.
దాడులు జరిగిన తీరును చూస్తుంటే ఇవి అప్పటికప్పుడు చెలరేగిన అల్లర్లలా కనిపించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. పక్కా స్కెచ్ తో జరిగినవే. ప్రత్యర్థులు కూడా వీటిని ధీటుగానే తిప్పి కొట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరే అనుమానాస్పదంగా ఉంది. ఈ వైఫల్యంలో సిట్ అధికారులు ఎవర్నీ బాధ్యులను చేయనున్నారో అనేది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే.. ఆ రోజు బయటకి వచ్చిన కొన్ని వీడియోలను పరిశీలిస్తే పోలీసులే.. పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నట్లు కనిపించింది. మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి కూడా ఇలానే ధ్వంసం చేశారు. పోలీసులు ఇలా ఎందుకు చేశారో అనేది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. పోలీసులే ఆధారాలను ధ్వంసం చేస్తే ఇక నిందితులను ఎలా పట్టుకుంటారనేది ఇక్కడి ప్రశ్న. సిట్ బృందం ఏం తేల్చనుంది. అధికారులను బాధ్యులని చేస్తారా.. లేక నాయకులినా అనేది తేలాల్సి ఉంది.