రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని... పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్ చెప్పారు. ఇదేం రెండు నాల్కల వైఖరి... ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అని సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు.
కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం... చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని కేటీఆర్ అడిగారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు.. అన్న కేటీఆర్.. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని కేటీఆర్ పేర్కొన్నారు. జయ జయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? అని అడిగిన కేటీఆర్... “కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్ ” అని తెలిపారు.
అధికారిక గీతంలో కీర్తించి..!! అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..?? అని కేటీఆర్ ప్రశ్నించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్ అన్న కేటీఆర్... కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని వివరించారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అన్న మాజీ మంత్రి కేటీఆర్..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని వ్యాఖ్యానించారు.