ఎంతటి నేతకైనా అధికారం కోల్పోతే అవమానాలు తప్పవు. అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ మెచ్చుకున్నవాళ్లే.. అధికారం కోల్పోగానే ఈసడిస్తుంటారు. రాజకీయాల్లో ఇది ఇంకా సహజం. ఇప్పుడు తాజాగా ఏపీ మాజీ సీఎం జగన్‌ పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జగన్‌పై చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం మరోసారి రుజువు అయ్యిందని చెప్పక తప్పదు.


ఇంతకీ రేవంత్ రెడ్డి జగన్ గురించి ఏమన్నారంటే.. ఇప్పుడు జగన్‌ చచ్చిన పాములాంటి వ్యక్తి అని కామెంట్ చేశారు. అసలు ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. ఇటీవల హైదరాబాద్‌లోని జగన్ ఇంటి ముందు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న రెండు గదులను అధికారులు కూల్చివేశారు. ఇది చంద్రబాబు చెబితే రేవంత్ రెడ్డి చేయించారని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు జగన్‌ అనే వ్యక్తి చచ్చిన పాము అని, అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని తాజాగా రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


కేసీఆర్ ఫామ్‌ హౌస్‌ ముందే ఏవేవో కట్టుకున్నారన్న సీఎం, అవేం తాము తీయలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తన ప్రధాన ప్రత్యర్థి మీదే తాను ఇలాంటివి చేయనప్పుడు, జగన్‌ విషయంలో ఎందుకు చేస్తానని రేవంత్ రెడ్డి తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చారు. అయినా చంద్రబాబు చెబితే తాను ఎందుకు చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌పై ఎంత నిబద్ధతతో పని చేస్తారో, తానూ తెలంగాణ కోసం అంతే నిబద్ధతతో పని చేస్తానని రేవంత్ రెడ్డి  అంటున్నారు.


చంద్రబాబు చెప్పారని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తే.. ప్రజలు తననెందుకు రాజకీయాల్లో ఉంచుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నా ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగం వదులుకుంటానా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జగన్‌ ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకెవ్వరూ చెప్పలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: