విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనే ఉపాధ్యాయుల ప్రధాన విధి. వాళ్లు బాగా చదువుతున్నారా? ఇచ్చిన పని చేస్తున్నారా? మార్కులు ఎలా వస్తున్నాయి. ఇలాంటి అంశాలను పరిశీలించడం వారి బాధ్యత. కానీ గత వైసీపీ సర్కారు వారిపై అనేక బోధనేతర పనులను కేటాయించింది. కేవలం చదువు చెప్పడమే కాకుండా పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం వంటి అంశాల్లో ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేసింది.


ఉదయం నుంచే విద్యార్థుల ఆన్ లైన్ హాజరు, మధ్యాహ్న భోజన సమయంలో భోజన చిత్రాలు, కోడి గుడ్లు, చిక్కీల నిల్వలు నిర్వహణ, స్టూడెంట్ కిట్ లబ్ధిదారుల వివరాలు నమోదు, నాడు నేడు పనులు ఇలా అనేక పనులను ఉపాధ్యాయులతో  చేయించింది. వీటిని తొలగించాలని అప్పట్లో ఉపాధ్యాయ సంఘాలు కోరినా వైసీపీ ప్రభుత్వం వినలేదు. వాస్తవానికి ఉపాధ్యాయులు సక్రమంగా ఇవన్నీ నిర్వర్తిస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగు పడతాయి.  వాటి నిర్వహణ తీరు మెరుగు పడుతుంది.


కానీ ఇవి చేసే వారికి మాత్రం ఇది బాధ్యతలా కాకుండా భారంలా కనిపించేది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కావాలని కోరుకునే వారు సైతం ఇలాంటి పనులు  చేయడానికి ఇష్టపడటం లేదు. విద్యార్థుల హాజరును ఉదయం 10.30 లోపు యాప్ లో నమోదు చేయాలి. దీనికి 15-20 నిమిషాలు పడుతోంది. అది పూర్తి అవగానే మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య, కోడిగుడ్లు తీసుకునే వారి సంఖ్యను నమోదు చేయాలి.


ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా.. లేవా అని తెలుసుకునేందుకు ఫొటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే ఏఐ గుర్తిస్తుంది. అప్పుడు వాటిని శుభ్రం చేయించి ఫొటోలు తీయాలి. దీనిని అప్ లోడ్ చేసేందుకు 20 నిమిషాల సమయం పడుతోంది. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా తెలుసు కోవడానికి ఆహార పదార్థాలును విడివిడిగానూ, కలిపి ఫోటోలు తీయాలి. తనిఖీ చేసిన ఉపాధ్యాయుడి ఫొటోను కూడా నమోదు చేయాలి. ఇప్పుడు వీటన్నింటిని తీసేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ మంచి ఆలోచనలే. ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్ పాఠశాలల్లో ఇంత గొప్ప మార్పులు తీసుకొచ్చారా అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp