మంచి చేసి ఓడిపోయాం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి నష్టపోయాం, సిద్ధం సభలకు వచ్చిన ప్రజాదారణ చూసి మోసపోయాం అంటూ వైసీపీ నేతలు ఓటమిపై  రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీ రావడాన్ని వైసీపీ శ్రేణులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఏది ఏమైనా ఐదేళ్లు టీడీపీ కూటమికి సరెండర్ అవ్వాల్సిందే.


అయితే ఈ ఎన్నికల్లో ఇంత దారుణ పరాజయానికి కారణం ఏంటనే విషయంపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రోడ్లు, అభివృద్ధి లేకపోవడం, కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకోవడం, ఎమ్మెల్యేలను మార్చడం ఇలా పలు అంశాలును ఓటమికి కారణాలుగా చూపుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు అయినా కాకున్నా.. మరో అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అదే ఎమ్మెల్యేల వ్యవహార శైలి.


అయితే దీనిపై గతంలోనే ఐప్యాక్ టీం జగన్ ను హెచ్చరించింది. దీంతో అప్రమత్తం అయిన జగన్ వారిని మార్చకుండా ఆ ఎమ్మెల్యేలు పోటీ చేసే స్థానాలను మార్చారు. మరికొంత మందికి ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. వాస్తవానికి ఎమ్మెల్యేలు తమ ఆదాయ వనరుల కోసం కొత్త కొత్త రూట్లను వెతుక్కున్నారు. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాకే అందజేయడంతో ఇందులో వారికి అవకాశం లేకుండా పోయింది.


దీంతో వారి చూపు ఆక్రమణలపై పడింది. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు, భూ కబ్జాలకు పాల్పడ్డారు. నేరుగా ప్రమేయం లేకున్నా అలా చేసే ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించారు. వారి వెంట తిప్పుకున్నారు. దీంతో పాటు ఇల్లు కట్టుకునే వారిని, కొత్త  స్థలం కొన్నవారిని బెదిరించి వారి వద్ద డబ్బులు వసూలు చేసేవారు. ఇలా చేసే వారంతా ఎమ్మెల్యేల చుట్టూ ఉండటంతో బాధితులు ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు ప్రజా దర్బార్ నిర్వహిస్తుండంటతో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. బాధితులు పార్టీ కార్యాలయాల వద్ద బారులు తీరుతుంటే అర్థం అవుతుంది వారికి తమ ఎమ్మెల్యేలపై ఎంత వ్యతిరేకత ఉందో. దాని పరిణామ క్రమమే ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితం కావడం.

మరింత సమాచారం తెలుసుకోండి: