దేశంలో  ఏ ఎన్నికలు వచ్చినా.. ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్ కుల గణన. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అంశమే. కాంగ్రెస్ ఇటీవల పార్లమెంట్ ఎన్నిక్లలో ఈ అంశాన్ని తమ మ్యానిఫెస్టో లో కూడా చేర్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.


పలు ఎన్నికల ప్రచార సభల్లో తాము గెలిస్తే.. దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని కూడా తెలిపారు. అయితే బీజేపీ మాత్రం కుల గణన పై ఎటువంటి ప్రకటన చేయలేదు. అనుకూలమా.. వ్యతిరేకమా అనే సంకేతాలను కూడా ఇవ్వడం లేదు. కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ వరకు అన్నీ కుల గణనకు మద్దతు ఇస్తున్నాయి.


ఇప్పటికే బిహార్, తమిళనాడు, ఏపీ లో ఆయా రాష్ట్రాలు కుల గణన చేపట్టాయి. తెలంగాణలో సైతం కులగణన నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రిజర్వేషన్లు మాత్రం పాతవాటినే ప్రస్తుతం అమలు చేస్తున్నారు. రిజర్వేషన్లు పెంచాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది.


ఇదిలా ఉంటే.. కేంద్రం కుల గణన చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ చేస్తున్న డిమాండ్ పై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మండిపడ్డారు. జేడీయూకు చెందిన రాజీవ్ రంజన్ సింగ్ తాము బిహార్ లో కుల గణన చేపడితే దానిని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని తెలిపారు. ఇప్పుడేమో కుల గణన చేపట్టాలని మొసలి కన్నీరు కారుస్తారని మండి పడ్డారు.


తాము యూపీఏతో కలిసి ఉన్నప్పుడు బిహార్ లో కుల గణన చేపట్టామన్నారు. తమ నిర్ణయాన్ని నాడు రాహుల్ గాంధీ వ్యతిరేకించారని.. ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ ఒత్తిడి కారణంగానే రాహుల్ కుల గణనను వ్యతిరేకించారని తెలిపారు. ఇప్పటికే ఈ క్రతువును పూర్తి చేసిన బిహార్ ను ఆయన ఎందుకు అభినందించడం లేదని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ కుల గణన ఎన్నికల అస్త్రమే అని పలువురు రాజకీయ వేత్తలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: