హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటుతో సీఎం రేవంత్ రెడ్డి చాలా మంది శత్రువుగా మారనున్నారు. కొన్నేళ్ల నుంచి నివాసముంటున్న ఇళ్లను, నిర్మాణాలను, కమర్షియల్ కాంప్లెక్స్ లను కూల్చివేస్తుండటంతో హైడ్రాను తెచ్చి లేనిపోని వివాదాన్ని తెచ్చుకున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.


అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరూ బయట పడకపోయినప్పటికీ ఆఫ్ ద రికార్డుగా హస్తం నేతలు ఈ చర్యలు పార్టీపై వ్యతిరేకితను కొని తెచ్చి పెడతాయని అంటున్నారు. అనవసరంగా వివాదాలను కొని తెచ్చి కోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి రకమైన చర్యలు పార్టీని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించుకొని నిర్మించిన భవనాలను కూల్చివేస్తుండటంతో హైదరాబాద్ లో కలకలం రేగింది. గత నెల రోజుల నుంచి హైడ్రా ఇదే పని మీద ఉంది. ధనికుల నుంచి సామాన్యుల వరకు ఎవర్నీ వదిలిపెట్టకుండా వారికి చెందిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అపార్ట్ మెంట్లు, బహుల అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లను కూడా వాటి నిర్మాణం అక్రమమని తేలితే కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. దీంతో బిల్డర్లు ఒకింత ఆందోళనకు గురి అవుతున్నారు.


దీనిపై కొందరు పార్టీ నేతలు హైకమాండ్ కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వీటిని లెక్కచేయడం లేదు. హైడ్రా లక్ష్యమే వేరు. హైదరాబాద్ ను వరద నీటి నుంచి సంరక్షించుకోవాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. హైడ్రాను మరింత బలోపేతం చేయడమే కాకుండా దానిని చట్టబద్ధం చేసే ప్రయత్నంలోను ఉన్నారాయన.


హైడ్రా చర్యల వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలే దీనిపై బహిరంగంగా విమర్శిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు.  హైడ్రాపై ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చినా రాజకీయ పార్టీల నాయకుల నుంచి మాత్రం రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: