హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ అక్రమ నిర్మాణదారులను, అదరు రాజకీయ నాయకులను వణికిస్తున్న సంస్థ. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు చాలా కట్టడాలను కూల్చి వేసింది. ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన నేపథ్యంలో ఇదో పెద్ద చర్చకు దారి తీసింది.


దీంతో హైడ్రా పేరు మారుమోగిపోయింది. మరోసారి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో , మంత్రి పొంగులేటి ఇల్లు హిమాయత్ సాగర్ లో, ఎమ్మెల్యే వివేక్ తదితరుల నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి.  ఇలా అధికార పార్టీ నాయకులకు సైతం హైడ్రా నోటీసులు అందజేయడం సంచలనంగా మారింది. అయితే హైడ్రా కూల్చివేతల విషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరు ఆ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోంది.


నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను ఎంపీ రఘునందన్ రావు పూర్తిగా సమర్థించారు. రాజాసింగ్ ఓ అడుగు ముందుకేసి ఓవైసీలకు చెందిన కాలేజీని కూల్చేయాలని… దీనికి తాను దగ్గరుండి సహకరిస్తానని ప్రకటించాడు. మరికొందరు హైడ్రాకు కూల్చివేతలకు మద్దతుగా… సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని హర్షిస్తూ బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.


అయితే ఈటల రాజేందర్ సామాన్యులకు హైడ్రా నోటీలసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. నోటీసులు అందిన వారిని కలిసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హైడ్రా అనేది బ్లాక్ మెయిలింగ్ కోసం ఏర్పాటు చేసిన సంస్థ అంటూ విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేందుకు దీనిని ఏర్పాటు చేశారని డీకే అరుణ ఆరోపించారు.


మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైడ్రాను పూర్తిగా సమర్థించారు. ఇక బీజేపీ శానససభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా విషయంలో క్లారిటీ లేకపోవడంతో పార్టీ క్యాడర్ గందరగోళానికి గురి అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: