నెల రోజుల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని పార్టీ నిర్ణయానికి వచ్చింది.


దీంతో ఆయా నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని సీనియర్ నేతలతో పార్టీ సీనియర్లు మాట్లాడినట్లు తెలిసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించినట్లు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మండలాల వారీగా సమాచారం ఇవ్వాలని త్వరలోనే సమావేశాలు నిర్వహించుకుందామని చెప్పినట్లు సమాచారం.


ఖైరతాబాద్ నుంచి దాసోజ్ శ్రవణ్ ను పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు విష్ణు వర్ధన్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి పేర్లను సైతం పరిశీలిస్తుందని తెలిసింది. స్టేషన్ ఘన్ పుర్ నుంచి కడియం రాజయ్యను ఇప్పటికే బరిలో దింపుతామని ప్రకటించింది. భద్రాచలం నుంచి బోదెబోయిన బుచ్చయ్య పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన వాజేడు మండలం మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. బుచ్చయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


కాంగ్రెస్ లో బీఆర్ఎల్పీ విలీనం అవుతుందని పార్టీ లీకులు ఇచ్చినా.. అయితే పలు కారణాలతో అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో హైకోర్టు తీర్పుతో పార్టీ మారదాం అనుకున్న  ఎమ్మెల్యేలు డైలమాలో పడినట్లు సమాచారం. అయితే కోర్టు ఆదేశాలను స్పీకర్ కార్యాలయం పాటిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు ఇచ్చిన గడువు వరకు వేచి చూద్దామని కొంతమంది.. పార్టీ మారడం ఎందుకు అని మరికొంతమంది ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. మరికొంత మంది చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఈ తరుణంలో వారంతా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs