మొండితనం కొన్ని సార్లు ఆయుధంగా మారుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మొండితనం కొంచెం ఎక్కువ. ఆ మాటకు వస్తే తెగింపు విషయంలోను ఆయన్ను వేలెత్తి చూపలేం. ఒకసారి డిసైడ్ అయ్యాక తన మాట తానే విననట్లుగా అప్పుడప్పుడు వ్యవహరిస్తారు పవన్ కల్యాణ్.


వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సమాచారం తెలుసుకుంటున్న ఆయన.. తన ఆరోగ్య సమస్యల్ని పక్కన పెట్టేశారు. తగ్గని జ్వరంతో ఇబ్బంది పడుతున్నా.. లెక్క చేయకుండా ముంపు ప్రాంతాల్లో నానా అవస్థలు పడుతున్న ప్రజల్ని కలిశారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కనిపించింది. పేదల ఇళ్ల వరకు బోటులో వెళ్లడం.. బురదమయంగా మారిన ప్రాంతాల్లో కాళ్లకు చెప్పులు లేకుండా తిరగడం.. ప్రతి ఒక్కరు చెప్పే సమస్యలు, కష్టాలను వింటూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. తాను ప్రాతినిథ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ముంపు ప్రాంతాన్ని సందర్శించారు.


బోటు ఎక్కిన పవన్.. కలెక్టర్ తో కలిసి ముంపునకు గురైన కాలనీలకు వెళ్లి.. ముంపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ స్థాయి వ్యక్తిని తక్కువ చేసి చూడలేం. అందునా పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి ఆటో మేటిక్ గా ఆయన చేసే పనులకు ప్రధాన మీడియాలో లభించే స్థానం.. ఆయన్ను కవర్ చేసే విషయంలో తీరు కాస్త భిన్నంగా ఉండటం కనిపించదు.


కానీ డిప్యూటీ సీఎం స్థాయి నేత జ్వరంతో బాధ పడుతూ.. కాళ్లకు చెప్పులు లేకుండా బురదలో నడుస్తూ కి.మీటర్లు నడిచినా.. ఆ అంశం ఎందుకు హైలెట్ కాదు. దాన్ని కనీసం కూడా ప్రధాన మీడియా ప్రస్తావించడం లేదు. ఇదే పనిని వేరే నాయకులు చేసి ఉంటే.. దానికి ఎర్ర సర్కిల్ వేసి మరీ ప్రస్తావిస్తారు. లేనిపోని హైప్ లను క్రియేట్ చేస్తారు. కానీ పవన్ విషయంలో అలా జరగడం లేదు. పవన్ చేసే పనులు,పడే కష్టం ప్రధాన మీడియా ఛానళ్లకు ఎందుకు కనిపించడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: