తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకొని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మొత్తంగా పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.


ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూ టర్న్ తీసుకోగా.. ఆయన్ను పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. మరో 16 మంది ఎమ్మెల్యేలను మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ఫలించడం లేదు. పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి క్యాబినెట్ హోదాతో వ్యవసాయ సలహాదారు పదవి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి డెయిరీ డెవలప్ మెంట్ ఫెడరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు.


పీఏసీ ఛైర్మన్ పదవి పార్టీ మారిన అరికెపూడి గాంధీకి ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఈ పరిస్థితుల్లో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ల అనర్హత పిటిషన్లను నాలుగు వారాల్లోగా తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా మరోసారి విచారిస్తామని వెల్లడించింది.


అక్టోబరు 9 తేదోలోగా 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. లేదంటే పార్టీలో చేరిన పది మందికి ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్ మోగినట్లే. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశం మీద కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనకు వెళ్లారు. పార్టీ ఫిరాయింపుల మీద దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. అయితే వీలైనంత త్వరగా 16 మందిని చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలనే పట్టుదలతో సీఎం రేవంత్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs