ఎస్సీల్లో ఉప వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో  ఈ సంచలన తీర్పు వెల్లడించింది. ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు ఆ వర్గీకరణను సమర్థించగా.. ఒకరు మాత్రం వ్యతిరేకించారు.


ఇలా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవతుంది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలోను ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో మాజీ ఎంపీ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేశారు.


అవును.. ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పుడు ఏపీలోను ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. వర్గీకరణను వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలో రాష్ట్రంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.


ఎస్సీ వర్గీకరణ-క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తూ గుంటూరులో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జీవీ హర్షకుమార్.. రాష్ట్రంలో అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొత్తపార్టీ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే విధి విధానాలు వెల్లడిస్తామని వివరించారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద మాదిగలు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని. అయితే ఉమ్మడి ఏపీలో మాత్రం మాదిగలు ఇందుకు భిన్నంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.


ఓ వ్యక్తి సృష్టించిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన మాదిగలు పోరాటంలోకి వెళ్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో క్రిమిలేయర్ ను పొందుపరిచిన కారణంగా ఉద్యోగస్తుల పిల్లలకు అన్యాయం జరగుతుందని చెప్పారు. ఈ విషయంలో చంద్రదబాబు మాయలో పడి ఇతర పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం లేదని అన్నారు. ఈ క్రమంలోనే వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: