ఏపీతో పాటు దేశాన్ని అట్టుడికిస్తున్న శ్రీవారి లడ్డూ వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకి చేరింది. కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారు అంటూ చంద్రబాబు సీఎం హోదాలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ ప్రకటన ప్రపంచంలోని హిందువులలో కలవరం రేపింది. ఆ మీదట ఈ బాణాలు అన్నీ సూటిగా వెళ్లి వైసీపీని తాకాయి.


ఈ వ్యవహారంలో తాజా పరిణామం ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. ఆరోపణలపై క్షుణ్ణంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానంలో పర్యవేక్షణ లో ఉండే కమిటీని నియమించేందుకు రిట్ ఆఫ్ మాండమస్.. లేకపోతే అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో సుప్రీం కోర్టుని సుబ్రహ్మణ్య స్వామి కోరారు.


ఇది ప్రజారోగ్యంతో పాటు.. వేంకటేశ్వరస్వామికి సమర్పించే నైవేద్యాలకు సంబంధించిన అంశమని.. చెప్పారు. భారత రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 ప్రకారం.. ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ.. ఈ విషయంలో న్యాయం జరిగేలా చూసేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్ లో కోరారు.


లడ్డూల తయాలో ఉపయోగించే నెయ్యి మూలం, నాణ్యతతో పాటు ల్యాబ్ పరీక్షలపై దృష్టి సారించి.. సంబంధిత అధికారుల నుంచి వివరణాత్మక ఫోరెన్సిక్ నివేదిక పొందేందుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ నేత కోరారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. అవి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర విచారణ కోసం కమిటీ వేయాలని.. నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చానన్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సైత ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక తిరుమలలో లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల, దైవత్వాన్ని పునరుద్ధరించేందుకు శ్రీవారి ఆలయంలో శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp