తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 2020 నుంచి 2023 వరకు బీజేపీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అధిష్ఠానం ఎన్నికల సమయంలో తప్పించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల ఒత్తిడికి బీజేపీ అధిష్ఠానం తలొగ్గిందన్న వాదనలు వినిపించాయి.


దీంతో అప్పటి వరకు జోష్ కు ఎన్నికలకు సిద్ధమైన కేడర్ ఒక్కసారిగా డీలా పడింది. కిషన్ రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. బండి సంజయ్ తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని అధికారంలోకి వచ్చింది.  ఇదిలా ఉంటే.. బండి సంజయ్ ని అధ్యక్ష బాధ్యతలు నుంచి తప్పించడానికి కొత్తగా పార్టీలో చేరిన ఈటల రాజేందర్ తో పాటు రఘునందన్ రావు, మరికొందరు నేతలు కారణమనే ప్రచారం జరిగింది. బీసీ నేత అయిన బండిని తప్పించేందుకు మరో బీసీ నేత అయిన ఈటల రాజేందర్  యత్నించడమే సంచలనంగా మారింది.


దీంతో పార్టీలోని బీసీ లు రెండు వర్గాలుగా విడిపోయారు. సంజయ్ కి కొన్ని వర్గాలు, ఈటల రాజేందర్ కు కొన్ని కులాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలను ఒక్కటి చేసేందుకు కమలం అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను తెరమీదకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.


బీజేపీలో బీసీలను చీల్చిన ఈటలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ఆర్ కృష్ణయ్యను పార్టీలోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. కృష్ణయ్య వస్తే.. పార్టీలోని బీసీలంతా ఒక్కటవుతారని.. పార్టీకి అది ప్లస్ అవుతుందని వచ్చే ఎన్నికల నాటికి బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని అధిష్ఠానానికి చెబుతున్నారు అంట. దీనికి అధిష్ఠానం కూడా సానుకూలంగా ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp