అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం్ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం అయ్యాయి. గత ఐదేళ్లుగా అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయింది. అడవిని తలపించింది. ఈ క్రమంలో అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది.

 


ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే అమరావతి పేరు వినిపించేది కాదు. కానీ అనూహ్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకుంది అమరావతి. అదే సమయంలో టీడీపీ కేంద్రంలో కీలక భాగస్వామిగా మారడంతో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం విశేషం. అమరావతి రాజధాని నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్లో రూ.15 వేల కోట్లను కేటాయించింది కేంద్రం. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించింది. అటు తొలి విడతగా రూ.3750 కోట్లు వచ్చే నెల విడుదల కానున్నాయి.


ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఈ పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందనుంది.  ఆ తర్వాత కూడా సాయం అందించేందకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఒకవైపు నేరుగా నగదు సాయంతో పాటు కీలక ప్రాజెక్టులను కూడా కేంద్రం మంజూరు చేస్తోంది. ఇక సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో ఉన్నారు. చాలా మంది కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.  నితిన్ గడ్కరీ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతికి కనెక్టివిటీ కి సంబంధించి కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది.


ఏపీలోని అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టవిటీ గురించి చంద్రబాబు ఆయనతో ప్రస్తావించారు. ఇక మరో మంత్రి కుమార స్వామితో కూడా సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ చర్చకు వచ్చింది. సెయిల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విలీన  ప్రతిపాదనలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని మోదీతో సీఎం చర్చించారు. మరోవైపు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రితోను ఇదే అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే అమరావతిని టార్గెట్ చేసి చంద్రబాబు దిల్లీ పర్యటన విజయవంతం అయినట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: