చాలా తొందరలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలో కొత్త ముఖాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే దాని అర్థం ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ అయిన పురంధేశ్వరినీ పోస్టుకి ఎసరు వచ్చినట్లు అంటున్నారు.  ఏపీ చీఫ్ గా ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు అని, టికెట్ల విషయంలో కొందరికి అన్యాయం జరిగిందనే ఫిర్యాదులు కేంద్ర నాయకత్వానికి వెళ్ళాయని అంటున్నారు.



దీంతో పాటు ఏపీలో బీజేపీ బలోపేతానికి ఇంతకు మించిన తరుణం వేరొకటి లేదు అని భావిస్తున్న బీజేపీ మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసిందని అంటున్నారు. ఏపీలో కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి బీజేపీని స్వతంత్రంగా పనిచేయనిస్తేనే కమలం ఏపీలో వికసిస్తుందని వారు భావిస్తున్నారంట.


అది కూడా ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికే బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ఈ పదవి విషయంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే ఆయన రాజ్యసభకు ఎంపిక అయి కేంద్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు.


ఈ నేపధ్యంలో ఏపీకి చెందిన ఆరెస్సెస్ ప్రముఖుడు, బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారణాసి రాం మాధవ్ పేరు కూడా ఈ కీలక పదవి విషయంలో వినిపిస్తోంది.  కమలం కన్నే తెలియని ఈశాన్య రాష్ట్రాలలో కాషాయాన్ని ఆవిష్కరింపచేసిన ఘనత రాం మాధవ్ కి ఉంది.  జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జిగా వ్యూహకర్తగా పనిచేసిన గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ భారీగా ఓట్లూ సీట్లు తెచ్చుకుంది. మిత్రుల మధ్య సయోధ్యను సక్రమంగా నెరుపుతూ సీట్ల విషయంలో బీజేపీ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటారన్న పేరు ఆయనకు ఉంది.


ఇక జనసేన బీజేపీ పొత్తును కూడా కలిపింది రాం మాధవ్ అని అప్పట్లో ప్రచారం ఉంది. ముందస్తు ఎన్నికలు అయినా లేక జమిలి ఎన్నికలు అయినా ఈసారి ఏపీలో బీజేపీ తనదైన రాజకీయ వాటాను పొందేందుకు కృషి చేస్తుందని అంటున్నారు.  మరి ఈ ప్రచారంలో నిజం ఎంతవరకూ ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి: