త్వరలోనే మరో ముగ్గురిని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఓకే చెబితే ఎంత మందికి చాన్స్ ఇస్తారనే దానిపైనా నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. వీరిద్దరు రాహుల్ గాంధీతో సమావేశమయ్యాక కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఏఐసీసీతో సన్నిహితంగా ఉండే సీనియర్లు లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పది రోజుల్లో కేబినెట్ విస్తరణ చేపట్టి లోకల్ బాడీ ఎన్నికలకు వెళతారని సమాచారం. ఏం ఉన్నా 22లోపు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే లోకల్ వార్ తర్వాతే' అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు. సంక్రాంతి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. ఆ టైంలో కేబినెట్ విస్తరణ చేస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశమున్నది పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే చాన్స్ దక్కనుందని సమాచారం. సామాజిక సమీకరణ కూర్పు కుదరకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం అధికంగా పోటీ పడుతున్నారు. ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని పక్కాగా కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్తో పాటు ఎస్టీ వర్గానికి చెందిన ఒకరికి చాన్స్ దక్కుతుందని టాక్.
ఇప్పటికే రెడ్డి వర్గం వారికి రేవంత్ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. అందుకే ఆ సామాజిక వర్గం నుంచి ఒకరికి మాత్రమే ఈసారి చాన్స్ దక్కనుందని టాక్. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రెడ్డి ఎమ్మెల్యేల లిస్టులో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి సైతం ఉన్నారు. ఇక అదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అన్నదమ్ములైన వినోద్, వివేక్ సైతం కేబినెట్ బెర్త్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.