కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న దిల్లీ ఆప్ శిబిరంలో ఆందోళనకు గురి చేస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరిన వేళ ఎమ్మెల్యేల రాజీనామాతో ఊహించని ఘులక్ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు బడ్జెట్ తో కొట్టింది. దేశ రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా 'ఐటీ మినహాయింపుల' అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది.
ఈ సారి దిల్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే లెక్కలేన్నీ హామీలను దిల్లీ ప్రజలపై గుప్పించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అలా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ కేజ్రీవాల్ కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్కు బదులు కాంగ్రెస్కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. పైగా అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, వరుసగా మూడు సార్లు అధికారంలో ఉండటం ఆప్కు ప్రతికూలాంశాలుగా మారాయి. ఇక ఇదే సమయంలో బీజేపీ సంఘ్ పరివార్ ను రంగంలోకి దింపింది. దీంతో వారు గల్లీ గల్లీ తిరుగుతూ ఆప్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పడినా తమకు నష్టం ఉండదని బీజేపీ భావిస్తోంది. పైగా గత ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ సీట్లు ఆప్ కు 15వేల లోపు మెజార్టీతో వచ్చినవే. ఈ సారి ఆ ఓటు బ్యాంకు ఎటు మారుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ.