దిల్లీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.  ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. శనివారం ఫలితాలు కూడా వెలువడనున్నాయి.  ఇలాంటి సమయంలో దిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.  ఎన్నికల ప్రచారంలో భాగంగా కత్తులు దూసుకున్న పార్టీలు, నేతలు ఇప్పుడు పోలింగ్ ముగిశాక కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగిస్తున్నారు.  



అంతే కాదు ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ చేసిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఆరోపణలు ఓవైపు కౌంటింగ్ కు ముందు కలకలం రేపుతుండగా.. ఇప్పుడు వాటిపై కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడం మరింత హీట్ పెంచుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని బీజేపీకి ఆధిక్యం లభిస్తుందని అంచనా వేశాయి.  వీటిని కేజ్రివాల్ పార్టీ ఆప్ తోసిపుచ్చింది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యే అభ్యర్ధుల్ని బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కేజ్రివాల్ ఆరోపణలు మొదలుపెట్టారు.  ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్ధికి రూ.15 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్లు ఆరోపించారు.  దీనిపై బీజేపీ ఫైర్ అయింది. ఈ ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చించింది. అయినా కేజ్రివాల్ తగ్గలేదు.


మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులు అప్రమత్తమైన ఆప్ అభ్యర్థులతో టచ్ లోకి వెళ్లిందన్న చర్చ మొదలైంది. దీనికి మరింత మసాలా జోడించి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.  దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రంగంలోకి దిగారు. 


కేజ్రివాల్ చేసిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఆరోపణలపై విచారణ జరపాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  కేజ్రివాల్ ఆరోపణలు తీవ్రమైనవని, వీటిపై దర్యాప్తు ప్రారంభించాని ఢిల్లీ ఏసీబీ అధికారుల్ని ఆదేశించారు.  ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ బృందం ఇవాళ ఆయన సివిల్ లైన్స్ నివాసానికి చేరుకుంది.  ఆప్ తన సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ కేజ్రివాల్ చేస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: