
మిత్ర దేశం, శత్రు దేశం అనే తేడా లేకుండా డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో.. చాలా దేశాలతో పాటు భారతీయులను స్వదేశానికి తరలించేశారు. ఇటీవల 104 మంది భారతీయుల్ని కూడా తిరిగి ఇండియాకి పంపించారు. అయితే వలసదారుల్ని ఒక ప్రత్యేక విమానంలో ట్రంప్ వెనక్కి పంపిస్తున్నారు. దీనికోసం అగ్రరాజ్యం అమెరికా వెచ్చించిన ఖర్చు భారీగా ఉండటం గమనార్హం.
ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17ఏ గ్లోబ్ మాస్టర్ 3 విమానం లో తీసుకొచ్చి అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ లో దింపారు. దీనికోసం అమెరికాకు అయిన ఖర్చు ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. దాదాపు 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. భారత కరెన్సీలో సుమారు రూ.8.74 కోట్లన్నమాట. 104 మందిని అమెరికా నుంచి భారత్ కు పంపాలంటే అంత ఖర్చవుతుందా.. అని అంటే.. దానికి కారణం రెగ్యులర్ పౌర విమానాలతో పోలిస్తే సైనిక విమానాల మెయింట్నెన్స్ ఖర్చు మూడు రెట్లు ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు.
అమెరికా నుంచి అమృత్ సర్ రావడానికి ఈ మిలటరీ విమానానికి సుమారు 43 గంటల సమయం పట్టిందని చెబుతున్నారు. ఈ లెక్కన తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే.. వలసదారులను భారత్ కు తరలించడానికి మొత్తంగా ఒక మిలియన్ డాలర్ పైనే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అంటే.. ఒక్కో వలసదారుడిపైనా రూ.8.74 లక్షలుపైనే అమెరికా ఖర్చు చేసిందన్నమాట.
గతంలో అక్రమ వలసదారుల తరలింపునకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) విభాగం కమర్షియల్ ఛార్టర్ ఫ్లైట్స్ ని ఉపయోగించిందే. ఈ క్రమంలో 2021 లెక్కల ప్రకారం.. ఆ విమానాల ఖర్చు గంటకు 8,755 డాలరు గా ఉండేది. అంటే.. సుమారు ఏడున్నర లక్షల రుపాయలన్నమాట. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ వలసదారుల తరలింపు కోసం తొలిసారిగా సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో సీ-17 మిలటరీ విమానం రవాణా ఖర్చు గంటకు 28,652 డాలర్లుగా చెబుతున్నారు. అంటే... సుమారు రూ.25 లక్షలు.