ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తున్న కేంద్రం.. అలాగే కొత్త పథకాలకు కూడా సహకరిస్తోంది.ఇందులో భాగంగా తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన ఓ కీలక పథకానికి ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు పంచాయతీలకు మేలు జరగబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.


రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను బాధ్యతలు చేపట్టగానే పంచాయతీల బలోపేతంపై దృష్టిసారించారు. గతంలో ఐదేళ్ల పాటు నిధుల్లేకుండా అల్లాడిన పంచాయతీలకు రెగ్యులర్ గా కేంద్రం ద్వారా తీసుకుని మరీ నిధులు ఇస్తున్నారు. ఇదే క్రమంలో పంచాయతీల బలోపేతానికి మరో కేంద్ర ప్రభుత్వ పథకంలో వాటిని భాగస్వామిని చేశారు. దీంతో ఆయా పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి జరగబోతోంది.


కేంద్ర ప్రభుత్వం పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి కోసం వికసిత్ పంచాయత్ కర్మయోగీ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, అస్సోం, ఒడిశాల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని పవన్ చొరవతో ఇప్పుడు ఏపీకి సైతం విస్తరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న 15 పంచాయతీల్ని ఎంపిక చేశారు.దీంతో ఈ పంచాయతీల్లో అధికార విక్రేంద్రీకరణ, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఏఐ వాడకం వంటి చర్యలు తీసుకుంటారు.


ఇలా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎంపిక చేసిన 15 పంచాయతీల్లో పాడేరు మండలంలోని కిండంగి, మినుములూరు, గుతులపుట్టు, డోకులూరు, కడెలి, డి.గొందూరు, వంజంగి, హుకుంపేట మండలంలోని మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టుజోరు, జీకే మందా, తాడిపుట్టు ఉన్నాయి. అలాగే జీ మాడుగుల మండలంలోని బోయితిలి కూడా ఉంది. వీటిని వికసిత్ పంచాయత్ పథకం కింద మోడల్ పంచాయతీలుగా అభివృద్ధి చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: