
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై దగ్గర పది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు బీజేపీ అధినాయకత్వం. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. ఫలితాలు 8న వచ్చేశాయి. కానీ సీఎం సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితం వెల్లడైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
నిజానికి.. ఎన్నికల ఫలితాల మీద బీజేపీకి నమ్మకం ఉంది. ఈసారి తాము తప్పక విజయం సాధిస్తామన్న ధీమాను ఆ పార్టీ అధినాయకత్వం ప్రదర్శిస్తోంది. అందుకు తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎన్నికల ఫలితాలు అలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రిగా ఎవరిని డిసైడ్ చేయాలన్న దానిపై బీజేపీకి ఓ క్లారిటీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముందు బీజేపీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లదు. ఇప్పుడు కూడా ఇదే సంప్రదాయం కొనసాగింది.
హరియాణా, ఒడిశా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో ఎవరూ ఊహించని వ్యక్తిని ఆ రాష్ట్ర సీఎం చేసి ప్రత్యర్థులతో పాటు రాజకీయ విశ్లేషకులకు షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం. ఇప్పుడు దిల్లీలోను అదే జరుగుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రి ఎవరన్న అంశాన్ని నిర్ణయించింది లేదు. కానీ.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే తేదీ.. ముహుర్తం కూడా నిర్ణయించేయటం గమనార్హం.
తాజాగా బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు దిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు బీజేపీ 48 స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ కాలేదు కానీ.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే టైం మాత్రం ఫిక్స్ అయ్యిందన్న మాట.