
ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టినా మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా హాట్ హాట్ గానే కొనసాగుతున్నాయి. కూటమి పార్టీల మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తనకు సీఎం పదవి దక్కలేదని అలక పాన్పు మీదనే ఉన్నారు. బీజేపీకి అంటిముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
ఏ క్షణంలో 'మహా' బాంబు పేలుతుందో అంతుపట్టడం లేదు. మహాయుతి నేతల మధ్య సఖ్యత లేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం.. నిప్పుకు ఆజ్యం పోసినట్టు కాబోతున్నది. ఫడ్నవీస్ ప్రభుత్వం తాజాగా 20 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల వై కేటగిరీ భద్రతను కుదించేందుకు రంగం సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు వై సెక్యూరిటీని కుదించనున్నారు.
బీజేపీ, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు కూడా సెక్యూరిటీని తగ్గించనున్నారు. అయితే షిండే శివసేన కంటే తక్కువ సంఖ్యలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు, అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గతంలో మహావికాస్ ఆఘాడీ కూటమి నుంచి కూడా కొందరు అధికార పార్టీలో చేరారు. వారికి కూడా సెక్యూరిటీని తగ్గించనున్నారు.
మహారాష్ట్రలో 'మహాయుతి' కూటమి ఘన విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆ పార్టీ నేత ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే అలకబూనారు. అయినప్పటికీ పొత్తు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి అయిష్టంగానే బీజేపీకి సీఎం పదవి అప్పగించారు. అయినా కూడా ప్రతీ సందర్భంగా మూడు పార్టీల్లోని లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి.
ఇప్పటికే పలు సందర్భాల్లో వీరి మధ్య విభేదాలు బయట పడగా.. తాజాగా సెక్యూరిటీ కుదింపు విషయం మహాయుతి కుంపటిని మరింత రాజేయనుంది. మరి తాజా వివాదంతో షిండే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి. ఈ విభేదాలపై శివసేన ఉద్ధవ్ థాకరే ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర విమర్శలు గుప్పించారు.