కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారి చివరకు ప్రశాంతంగా ముగిశాయి.  మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ముడా స్థలాల కేటాయింపు ఇష్యూని తెచ్చి భారీ కుంభకోణం మాదిరిగా చిత్రీకరించి కాంగ్రెస్ సీఎం సిద్ధ రామయ్యను ఇబ్బంది పెట్టాలని ప్రతిపక్ష బీజేపీ చూసింది.  ఇదే క్రమంలో సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం వారు కూడా ఇదే సందు అన్నట్లుగా ఆయన దిగిపోతే బాగుండునని అనుకున్నారు.  



సిద్ధరామయ్య మాత్రం మొదటి నుంచి ఈ ఇష్యూలో తన తప్పు లేదని వాదిస్తూ వచ్చారు. చివరికి అదే నిజం అన్నట్లుగా ఆయనకు ముడా కుంభకోణంలో క్లీన్ చిట్ లభించింది.  ముడా స్థలాల కేటాయింపు కేసుకు సంబంధించి సిద్ధరామయ్యకు ఆయన సతీమణికి అలాగే అభియోగాలను మోస్తున్న మరో ఇద్దరికీ సంబంధం ఉన్నట్లుగా ఏ రకమైన ఆధారాలూ లేవంటూ లోకాయుక్త  క్లీన్ చిట్ ఇచ్చింది.   ఈ కేసులో నేరం రుజువు కాలేదని అందువల్ల తుది నివేదికను హైకోర్టుకి సమర్పించామని విచారణ జరిపిన అధికారులు వెల్లడించారు.


ఇక ఈ కేసు విషయానికి వస్తే ముడా స్థలాల కేటాయింపులో సిద్ధరామయ్య ఆశ్రిత పక్ష పాతానికి పాల్పడ్డారని అనేక సెక్షన్ల కింద కేసులను గతంలో నమోదు చేశారు. దీంతో ఇది రాజకీయంగా పెను సంచలనమైంది.  సీఎం మీద ఈ తరహా సెక్షన్ల మీద కేసు ఫైల్ కావడంతో ఆయనకు పదవీ గండం తప్పదని కూడా రాజకీయ పండితులు ఒక దశలో తేల్చేశారు.

అయితే ఇపుడు క్లీన్ చిట్ తో బయటపడిన సిద్ధరామయ్య తనదైన రాజకీయంతో అయిదేళ్ళూ సీఎం గా ఉండేందుకు పావులు కదుపుతారని అంటున్నారు.  సిద్ధరామయ్యనే కొనసాగించాలన్న వర్గాలూ కాంగ్రెస్ లో బలంగానే ఉన్నాయి. ఇక డీకే కి పోటీగా అయిదారుగురు రేసులోకి వస్తున్నారు. సిద్ధరామయ్యను కదిపితే ఎవరికి పదవి ఇచ్చినా సిద్ధరామయ్యతో పాటు మిగిలిన వారూ వర్గాలుగా మారుతారన్న ఆందోళన కూడా కాంగ్రెస్ లో ఉంది.


ఇంతకాలం సిద్ధరామయ్య మీద ముడా కుంభకోణం కేసు ఉంది అన్న సాకుతో ఆయనను తప్పించాలన్న డిమాండ్ ఉంది.  దానిని ఆసరాగా చేసుకుని ముందుగానే పదవికి ఎసరు పెట్టే యత్నాలూ జోరుగా సాగాయి. ఇపుడు చూస్తే సిద్ధరామయ్య రాజకీయంగా బలంగా మారారని అంటున్నారు. దాంతో ఆయన అయిదేళ్ళ సీఎం అని ఆయన వర్గీయులు అంటున్నారు.  మరి డీకేకు పవర్ షేరింగ్ ఉంటుందా లేదా అన్నది నవంబర్ లో కానీ తేలదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: